మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలి

మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలి– గిరిజన సంక్షేమ శాఖలో సమీక్షించిన మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలనీ, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించారు. కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్టు చూడాలనీ, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని చెప్పారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదాకోసం కేంద్ర ప్రభుత్వానికి మరో సారి ప్రతిపాదనలు పంపుతామనీ, రాష్ట్ర బడ్జెట్‌కు కేంద్రం నిధులు తోడైతే.. జాతరను మరింత ఘనంగా నిర్వహించు కోవచ్చు నన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదనీ, శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్‌. చొంగ్తు సమన్వయం చేయగా శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌ రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌, ట్రైకార్‌ జీఎం శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.