జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం

నవతెలంంగాణ-హైదరాబాద్‌
రాష్ట్రంలో గత కొద్ది కాలం క్రితం మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అంతేగాక ఐదేండ్ల పాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.3000 పెన్షన్‌, ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు చదివే ఇద్దరు పిల్లలకు నెలకు రూ. 2000 ట్యూషన్‌ ఫీజు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, ప్రమాదానికి గురై భతిని కోల్పోయిన జర్నలిస్టులు, ఇతర వ్యాధులకు గురైన వారికి తీవ్రతను బట్టి రూ. లక్ష చొప్పున, ఇద్దరికి రూ. 50 వేల చొప్పున మొత్తం ఐదుగురికి ఆర్థిక సాయం అందజేసినట్టు తెలియజేశారు. శుక్రవారం జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి సమావేశంలో సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ పక్షాన జాయింట్‌ డైరెక్టర్‌ జగన్‌, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్‌ పీసీ వెంకటేశం, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.