నిమ్స్‌లో మంత్రి పొన్నంకు వైద్యపరీక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గురువారం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ విభాగం సీనియర్‌ వైద్యులు ప్రొఫెసర్‌ సాయిసతీష్‌, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు ప్రొఫెసర్‌ నావెల్‌ చంద్ర, పల్మనాలజీ సీనియర్‌ వైద్యులు పరంజ్యోతి ప్రత్యేక పర్యవేక్ష ణలో ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. వారికి నిమ్స్‌లో అందిస్తున్న సేవల గురించి ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ మంత్రికి వివరించారు. పేద రోగులకు అందుతున్న సేవలపై పొన్నం సంతృప్తిని వ్యక్తం చేశారు.