ప్రస్తుతం చాలా మంది.. చర్మ ఛాయ తగ్గడం, నల్లని మచ్చలు, ఇలా చాలా రకాల పిగ్మెంటేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కాస్త జాగ్రత్త తీసుకుంటే ఈ సమస్య పరిష్కారానికి ఇంట్లోనే మందును తయారు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
– విటమిన్ సి తగినంతగా మన శరీరానికి అందినప్పుడు పిగ్మెంటేషన్ సమస్య అదుపులో ఉంటుంది. రెండు చెంచాల నిమ్మరసంలో కాస్త గంధం కలిపి ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. ఆపై నీళ్లతో శుభ్రం చేసుకుని గులాబీ నీళ్లల్లో ముంచిన దూదితో మరోసారి తుడవండి. ఇలా వారంలో రెండు, మూడు సార్లైనా చేస్తుంటే ఫలితం ఉంటుంది.
– పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి తగిన పోషణ అందిస్తుంది. పాలల్లో చెంచా గులాబీరేకల పొడి, కొద్దిగా తేనె, చెంచా సెనగపిండి కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుని స్క్రబ్లా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మచ్చలు పోతాయి. మృతకణాలూ తొలగిపోతాయి.
– సమాన పరిమాణంలో బొప్పాయి, కలబంద గుజ్జుల్ని తీసుకుని దానికి చెంచా ఓట్స్ పొడిని కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. ఆపై చేతుల్ని తడుపుకొని సవ్య, అపసవ్య దిశల్లో మునివేళ్లతో మర్దన చేయాలి. దీనివల్ల ముఖం కాంతిమంతంగా మారుతుంది. మచ్చలూ క్రమంగా పోతాయి.