మంగోలియాలో పశువులకు ఎంఇఐఎల్‌ సాయం

– ప్రతికూల పరిస్థితుల్లో పశుగ్రాసం లేక ఇబ్బందులు
హైదరాబాద్‌ : ప్రతికూల పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న మంగోలియాలోని పశువులను కాపాడేందుకు మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) చర్యలు చేపట్టింది. ”ప్తస్తుతం మంగోలియాలో విపరీతమైన మంచు కురుస్తోంది. పశువులు ముఖ్యంగా గొర్రెలు, ఆవులు మొదలైన వాటికి తీవ్రమైన మంచు వల్ల పశుగ్రాసం దొరకటం లేదు. దీంతో అవి మృత్యువాత పడుతున్నాయి. కాపరులు కూడా చలిని తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మంగోల్‌ ఆయిల్‌ రిఫైనరీ బృందం తమ దేశంలోని పశువులను, వాటి కాపరులను కాపాడేందుకు తగిన సాయం చేయాల్సిందిగా అక్కడ గ్రీన్‌ ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ నిర్మిస్తున్న ఎంఇఐఎల్‌ను కోరింది. తక్షణమే స్పందించిన ఎంఇఐఎల్‌ అక్కడి పశువులు, వాటి కాపరులకు తగిన సాయం చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ట్రక్కులో పశుగ్రాసాన్ని, పశువుల కాపరులు చలికి తట్టుకునేలా బ్లాంకెట్స్‌, ఉలెన్‌ జాకెట్స్‌, ఆహారం అందచేసింది.” అని ఎంఇఐఎల్‌ తెలిపింది. అనానుకూల పరిస్థితుల్లో మెగా ఇంజనీరింగ్‌ చేసిన సాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేమని మంగోల్‌ ఆయిల్‌ రిఫైనరీ టీం సిఇఒ అల్టాన్‌ సెట్‌ సెగ్‌ దశ్దవ్వ పేర్కొన్నారు.