– కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుంచి చేరికలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్ఎస్లో వివిధ పార్టీల నుంచి నాయకులు చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడల్ మానవతా రారు, నాయకులు నోముల ప్రకాష్ రావు, జగదీశ్వర్, ప్రవీణ్ లాలా, యండీ షాకీర్ (కుత్బుల్లాపూర్) బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్థన్ రెడ్డి (మెదక్), బీయస్పీ దేవరకొండ ఇన్ఛార్జి రమావత్ రమేష్ నాయక్, పీఏ పల్లి మండలం అధ్యక్షులు ధర్మపురం శ్రీనివాస్ గులాబీ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అరాచక రాజకీయం జరుగుతోందనీ, ఆర్థిక తీవ్రవాదం నడుస్తున్నదనీ, టికెట్లను అమ్ముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ గొంతుక కేసీఆర్ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు గమనించాలని కోరారు. నేతన్నలకు అనేక పథకాలు తెచ్చామనీ, మళ్లీ అధికారంలోకి వచ్చాక వారికి మరింత అండగా ఉంటామని చెప్పారు.