మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి

Minister KTR's comments should be withdrawn– ఆశాలకు పారితోషికం వద్దు.. కనీస వేతనం ఇవ్వాలి
– పనికి తగ్గ పారితోషికాలు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోండి : సీఐటీయూ రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్‌ ఎస్‌.రమ
– హైదరాబాద్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష ప్రారంభం
– మేడ్చల్‌, రంగారెడ్డిలో వంటావార్పు
నవతెలంగాణ-బేగంపేట్‌
ఆశావర్కర్లు, సీఐటీయూ మీద మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర శ్రామిక మహిళా కన్వీనర్‌ ఎస్‌.రమ డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్ల సమ్మె 13వ రోజు తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌ కమిటీల ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లోని హైదరాబాద్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారించాలని కోరుతూ హన్మకొండలో మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన సీఐటీయూ నాయకత్వాన్ని, ఆశా వర్కర్లను ‘పనిలేని సంఘాలు, యూనియన్లు పెట్టి రెచ్చగొడితే సమ్మెలు చేస్తారా’ అంటూ ఆశాలను కించపరుస్తూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ 9,750/- పారితోషకం ఇస్తున్నామని గొప్పలు చెప్పడాన్ని తప్పుబట్టారు. హర్యానా రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.14 వేల పారితోషికం, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,000 ఫిక్స్‌డ్‌ వేతనం, పాండిచ్చేరిలో రూ.10 వేలు ఇస్తున్నారని తెలిపారు. దీనికి కేటీఆర్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పనికి తగ్గ పారితోషికం విధానాన్ని వెంటనే రద్దు చేసి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18,000 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పనికి తగ్గ పారితోషికం విధానాన్ని ముందుగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అమలు చేయాలని సూచించారు. ఆరు నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
ఆశా వర్కర్లకు జాబ్‌ చార్ట్‌ ప్రకటించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆశాల యూనియన్‌తో చర్చలు జరిపి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగ్గిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌, సౌత్‌ సిటి కమిటీ అధ్యక్షురాలు ఎం.మీనా, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు టి.యాదమ్మ, ఎం.అనిత, కోశాధికారి యం.రాణి, ఉపాధ్యక్షులు భాగ్యలక్ష్మి, నాయకులు శ్రీదేవి, రమామని, నికత్‌, అరుణ పాల్గొన్నారు. ుడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్‌ చౌరస్తాలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆశావర్కర్లు వంటా వార్పు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కందుకూరులో వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. కడ్తాల్‌లో దీక్ష చేశారు.