నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చర్యలు: మంత్రి శ్రీధర్ బాబు

– పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు అవసరమైన సంస్కరణలు
– రూ.30 కోట్లతో 478 పాఠశాలలో మౌళిక వసతుల కల్పన
– స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రత్యేక కార్యాచరణ
నవతెలంగాణ – మల్హర్ రావు
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లుగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. బుధవారం మంథని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో నిర్వహించిన బడిబాట ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆసాంతం మంత్రి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న తరగతి గదులు, లంచ్ రూమ్, స్పోర్ట్స్ వింగ్, ల్యాబ్, గ్రంథాలయం, టాయిలెట్స్ ను మంత్రి తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌళిక వసతుల కల్పన పనుల వివరాలను మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యకు సంబంధించిన ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉండాలని, దానికి అవసరమైన సంస్కరణలు తీసుకుని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే అవసరమైన మౌళిక వసతులు కల్పించి రూపురేఖలు మార్చే దిశగా కృషి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం  కోసం కలెక్టర్ నుంచి పాఠశాల సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల పనితీరును కలెక్టర్ రెగ్యులర్ గా సమీక్షించాలని మంత్రి సూచించారు. పిల్లల పై అధికంగా శ్రద్ద వహించే తల్లులకే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు.
మహిళా సాధికారత మాటలకే పరిమితం కాకుండా చేతలు కూడా ఉండాలనే ఉద్దేశంతో  మన ప్రభుత్వం పని చేస్తుందని, అందులో భాగంగా ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌళిక వసతుల కల్పన అప్పగించామన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన మౌళిక వసతులు, ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను పరిశీలించిన తర్వాత మన జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 984 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన కొనసాగిస్తున్నామని, అర్హత కలిగిన టీచర్ లందరికీ పదోన్నతులు కల్పిస్తామన్నారు.పాఠశాలల్లో చదివే విద్యార్థులందరు మా పిల్లలే అని భావించి వారికి  అవసరమైన క్రీడా పరికరాలను ఏర్పాటు చేసి, బుధవారం స్పోర్ట్ యూనిఫాంతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు..ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన చాలా మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని, ప్రస్తుతం మన సమావేశంలో ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పోలీస్ అధికారులు, తామంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని, చిన్నారులందరిని గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం తరపున అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. పాఠశాల ఉన్నత తరగతులకు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశామని పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.రూ.30 కోట్ల నిధులతో 478 ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పనులు చేపట్టి, 99 శాతం పనులు పూర్తి చేశామన్నారు.  మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి అందిస్తున్నామని తెలిపారు.
భవిష్యత్తులో గ్రంధాలయాల అభివృద్ధికి డిజిటల్  లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సూచించారు. మార్కెట్ లో వచ్చే కొత్త కోర్సులు, ట్రెండ్స్  నైపుణ్యాలు విద్యార్థులకు అందించడం కోసం ఐటిఐ లను ఆధునీకరిస్తున్నామన్నారు. 65 అడ్వాన్స్ లెర్నింగ్ కేంద్రాలను దాదాపు రూ.2234 కోట్ల రూపాయలు, టాటా కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాటారం ఐటిఐ ఆధునీకరణ కోసం రూ.6 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.ప్రస్తుతం ఉన్న విద్యార్థులంతా భవిష్యత్తులో నేను సెల్యూట్ చేసే స్థాయికి చేరుకోవాలని పేర్కొన్నారు.పరిశ్రమల శాఖ మంత్రి గా స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా  కోకో కోలా అనే బహుళ జాతి కంపెనీ తీసుకోని వస్తున్నామన్నారు. చిన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తీసుకోని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక చిన్న ఐటీ సంస్థ సైతం అతి త్వరలో మంథనిలో ఏర్పాటు కాబోతుందని, 50 మంది యువతకు నెల రోజుల లోపు ఉపాధి కల్గుతుందన్నారు.జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ కాలనీలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని, అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మన యువకులకు వచ్చేలా అవసరమైన నైపుణ్యం అందజేస్తామని మంత్రి తెలిపారు.