ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష

– అధికారులపై ఆగ్రహం
– పనులు సరిగ్గా జరగడం లేదని విమర్శలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర సచివాలయంలోని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్‌ శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్‌ లో ఉమ్మడి ఆ శాఖ అధికారులతో ఇరిగేషన్‌ శాఖ మంత్రివర్యులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్లగొండ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణవెళ్ళంల, ఎస్‌ఎల్‌బీసీ ి టన్నెల్‌, నక్కలగండి, చర్ల, రిజర్వార్లు, బునాది గాని పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి మూసి కాలువల పెండింగ్‌ పనులు పురోగతి గురించి వాడివేడిగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూకాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ. 2400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్‌ సాగర్‌ ప్రాజెక్టులను రీ డిజైనింగ్‌ పేరిట రూ. 13వేల కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం పెంచడం వల్ల అదనంగా ఆయకట్టు పెరిగిందా? అంటూ అడిగారు. అందుకు అధికారులు ఏమాత్రం పెరగలేదని అంతే సమాధానం చెప్పారు. ఆయకట్టు పెంచకుండా రీ డిజైనింగ్‌ పేరుతో ప్రాజెక్టు అంచనాలను పెంచి ప్రజల సంపదను దుర్వినియోగం చేయడం సరికాదని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టులో జరిగిన పనుల గురించి వాస్తవాలు చెప్పాలని ఆదేశించడంతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇరిగేషన్‌ అధికారులు ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తయిన బ్యారేజీ కెనాళ్ల పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు, చేయాల్సిన భూసేకరణ, కోర్టు కేసులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల గురించి మంత్రులకు వివరించారు. బ్యారేజ్‌ నిర్మాణానికి ఇంకా ఎన్విరాన్మెంట్‌ క్లియరెన్స్‌ రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. హెడ్‌ వర్స్‌ దగ్గర పనులు పూర్తి చేయకుండా చివరి కాలువల వద్ద పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పురోగతిలో ఉందని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అన్న దానిపై అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు మింగారు. నిజాలను దాచిపెట్టకండి వాస్తవాలు చెప్పండి అంటూ అధికారులను సుతిమెత్తగా మంత్రులు మందలించారు. శబరి, గోదావరి నదులు కలిసిన చోట 365 రోజుల పాటు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాంతాన్ని విస్మరించి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైనింగ్‌ చేసి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పెట్టడం వల్ల అంచనా వ్యయం పెరిగింది తప్ప, పది సంవత్సరాలుగా అదనంగా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని అధికారులను నిలదీశారు. గతంలో రూపొందించిన ఇందిరా సాగర్‌ ప్రాజెక్టును యధావిధిగా కొనసాగిస్తే ఇప్పటివరకు పనులు పూర్తయ్యి నీళ్లు వచ్చే అవకాశం ఉండేదని, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టు డిజైనింగ్‌ కరెక్టుగా నే రూపొందించారని అధికారులు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం వచ్చే నాటికి మధిర నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న జాలుముడి, మున్నేరు ఆనకట్టలను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాటిని పూర్తి చేయడానికి కావలసిన అంచనాలు, వ్యయాలను రూపొందించాలన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేసి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. నల్లగొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాలపై సాగునీరు అందించే ఎస్‌ఎల్బీసీ నక్కలగండి డిండి ప్రాజెక్టుల పనులుఇంకా ఎంత శాతం పనులు పెండింగ్‌ లో ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఎంత నిధులను ఖర్చు చేసింది, అలాగే ఇంకా ఎంత నిధులు అవసరం ఉన్నాయి. సమద్ధిగా నిధులు ఇస్తే ఎప్పటిలోగా పూర్తి చేశారన్న అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి మాట్లాడుతూలి హెడ్‌ వర్క్స్‌ పూర్తి చేయకుండా ఫలితం ఏమంటుందని అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం రూ.. 200 నుంచి రూ. 300 కోట్లతో పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల ప్రజలపై భారం మోపిందన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నాలుగు రకాలుగా విభజించాలని ఆదేశించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యే ప్రాజెక్టులు, 18 నెలల్లోగా ప్రాజెక్టులు 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి వాటి కావాల్సిన బడ్జెట్‌ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్‌ అలాట్మెంట్‌ చేసిన వాటిని కూడా ఆపివేయాలని ఆదేశించారు. చెరువుల మరమ్మతులు, చెక్‌ డ్యాముల నిర్మాణం కోసం, ఎమ్మెల్యేల నుంచి వచ్చే సిఫారసులను స్వీకరించి వాటికి కావలసిన నిధుల మంజూరుకి కషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్‌ చేసిన సీతారామ ప్రాజెక్టు వల్ల వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఇది బ్యాడ్‌ రీ డిజైనింగ్‌ లా ఉందని అసంతప్తిని వ్యక్తం చేశారు.

అధికారులపై పొంగులేటి ఆగ్రహం
సీతరామ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా చెప్పని అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ హెడ్‌ వర్క్‌ నుంచి చివరి కెనాల్‌ వరకు ఫేజ్‌ ల వారీగా జరిగిన పనుల గురించి అధికారులను అడిగారు. తత్తరపాటు సమాధానాలు చెప్పడంతో మీరు చేసే పని పైనే మీకు అవగాహన లేకుంటే ఎలా అంటూ ఈఈని మందలించారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టు గురించి చాలా లోతుగా మంత్రులు చర్చించారు. అదేవిధంగా నాగర్జున సాగర్‌ జలాశయంలో ఉన్న నీటి నిల్వలు, వాడకం గురించి అడిగారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.