నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి వ్యాప్తంగా ఆఫీసులలో పనిచేస్తున్న మినిస్టీరియల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు గుల్ల బాలాజీ అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియాలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు పరీక్ష తేదీని చెప్పకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారని, వెంటనే పరీక్ష నిర్వహించే తేదీని తెలియజేసి పరీక్షలు వెంటనే నిర్వహించి సిబ్బంది కొరతను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆఫీసు సిబ్బందికి పాత కుర్చీలను ఉపయోగించడం ద్వారా అనారోగ్య పాలవుతున్నారని, సరైన కొత్త ఫర్నిచర్ను ఏర్పాటు చేసి, పాతకాలపు ప్రింటర్ల స్థానంలో కొత్త డిజిటల్ స్కానర్ కం ప్రింటర్లను ప్రతి సెక్షన్లో ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పీఎఫ్ చిట్టిలను సకాలంలో ఇప్పించే విధంగా చూడాలని, ప్రతి ఆఫీసులో క్యాబిన్ల ఏర్పాటు చేయాలని ఆఫీసుల నిర్వహణ నిమిత్తం ఉన్న డెలిగేషన్ పవర్ను కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, వెంగళ శ్రీనివాస్, ఎం శ్రీధర్, శైల శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, శ్రీపతి బానేష్, కేసిపెద్ది శ్రీనివాస్, మిడివెల్లి శ్రీనివాస్, పెరుక సదానందం, తోడే సుధాకర్ పాల్గొన్నారు.