తిహాడ్‌ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసం బెయిల్‌ మంజూరు చేసింది. పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్‌, భారాస ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించారు. ఈ పూచీకత్తులను ఆమోదించిన రౌస్‌ అవెన్యూ కోర్టు.. కవితను విడుదల చేయాలంటూ తిహాడ్‌ జైలు అధికారులకు వారెంట్‌ జారీ చేసింది. దీంతో మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, భారాస నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత హైదరాబాద్‌ రానున్నారు.