ఉపాధి హామీ చట్టమును రద్దు చేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారు

– ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలి.. 
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు
కొట్లాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకం ను రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం మండలంలోని కల్వలపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్ ప్రచారం లో భాగంగా ఉపాధి కూలీల వద్దకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వ విధానంలపై ఉపాధి కార్మికులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు గత రెండు నెలలుగా రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనిని, ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తివేయడం ఖాయమని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధులను పెద్ద ఎత్తున కోత విధించిందని అన్నారు. గత సంవత్సరం రూ.90 లక్షల కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం రూ.63 లక్షల కోట్లకు తగ్గించిందని, ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయించే నిధులను కూడా భారీ ఎత్తున కొత్త విధించిందని, కోట్లాదిమంది గ్రామీణ పేదలు చేయడానికి పని లేక తినడానికి తిండి లేక వలసల దారి పడుతున్నారని చెప్పారు. దేశ సంపద ఒక్క శాతం మంది చేతిలోనే కేంద్రీకృతం అయిందని  మెజారిటీ ప్రజలు ఒక్క పూట తిండి దొరక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఆహార సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టిందని నిత్యవసర సరుకులైన గ్యాస్ కూరగాయలు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వాటిని కంట్రోల్ చేయకుండా ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుందని,  గ్రామీణ నిరుద్యోగం పేదరికం పై పైకి పాకిందన్నారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రెండు కోట్ల ఇండ్లు నిర్మాణం చేసి అందిస్తామని పేదల ఎకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని నల్లధనాన్ని విదేశాల నుండి తీసుకొస్తామని  మాటలు చెప్పి, నిలువునా మోసం చేశారని అన్నారు. ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మునుగోడు మండల నాయకులు మిర్యాల భరత్, సాగర్ల మల్లేష్, శివర్ల వీరమల్లు,వంటపాక అయోధ్య ,మాజీ సర్పంచ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.