– తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
తూత్తుకూడి : దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావద్దని , మళ్లీ మోడీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలంగా మారుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓట్లర్లను హెచ్చరించారు. మోడీని మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమనేది తమిళనాడు ప్రజల చేతుల్లో ఉందన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే సమాజంలో విష బీజాలు నాటుతుందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన ఆయన.. పార్టీ అభ్యర్థుల కోసం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లడుగు తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. మంగళవారం ఉదయం తూత్తుకుడి జిల్లాలో స్టాలిన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సోదరి, ఎంపీ కనిమొళితో కలిసి తూత్తుకుడిలోని కూరగాయల మార్కెట్లో, మత్స్యకారుల కాలనీలో ఆయన ప్రచారం చేశారు. స్థానికులు సీఎంతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.