తెలంగాణ గురుకులాల్లో 9వేలకు పైగా పోస్టులు..

నవతెలంగాణ- బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలను అధికారులు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు( టీఆర్‌ఈఐఆర్‌బీ) కన్వీనర్‌ మల్లయ్య భట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులాల్లో బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి గురుకుల విద్యాలయాల సంస్థ ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఆగష్టు 1నుంచి 23వ తేదీ వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని తెలిపారు. 9వేల పైచిలుకు పోస్టులకు గాను గురుకుల నియామక బోర్డు 9నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా..2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఒకటిరెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు వారు తెలిపారు.