ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీ రంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘తల్లి మనసు’. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం అన్నపూర్ణా స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పోకూరి బాబురావు క్లాప్ నివ్వగా, ఏషియన్ గ్రూప్ ఎం.డి.భరత్ నారంగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హాస్య నటుడు బ్రహ్మానందం, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొని, చిత్ర బందానికి శుభాకాంక్షలు అందజేశారు. చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, ‘నా దగ్గర ఎంతో మంది సహాయ, కో- డైరెక్టర్లుగా పనిచేశారు. వి.శ్రీనివాస్ (సిప్పీ)లో అద్భుతమైన టాలెంట్ చూసి, ఆయనకు అవకాశం కల్పించాం’ అని అన్నారు. ‘ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఆమె మనోవేదన, సంఘర్షణను ఇందులో ఆవిష్కరిస్తున్నాం’ అని దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) చెప్పారు. నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ,’నాన్న పేరు నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుంది. ప్రారంభం రోజు నుంచి యాభై రోజుల పాటు నిర్విరామంగా జరిగే షెడ్యూల్తో షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తాం. నవంబర్ లేదా డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు.