స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపిన ఎంపీ కేశినేని

నవతెలంగాణ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని.. సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతోపాటు విజయవాడ వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత సైతం మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని.. సీఎం జగన్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎంపీ కేశినేని నాని తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపారు.