మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని శనివారం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థుల కోసం ఆహార పదార్థాలను తయారు చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ఈగలు ఎక్కువగా ఉంటాయని వండిన ఆహార పదార్థాలపై తప్పనిసరిగా మూతలు పెట్టి ఉంచాలన్నారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా తాజా వాటిని కొనుగోలు చేయాలన్నారు. వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించాలని, పిల్లలకు శుభ్రమైన ఆహారాన్ని రుచికరంగా అందించాలని తెలియజేశారు.విద్యార్థులు కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే భోజనాలు చేయాలని సూచించారు. విద్యార్థుల కోసం వండి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.