– 4,5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన
– 7 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
– 11న తొలివిడత సీట్ల కేటాయింపు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు సెప్టెంబర్ రెండో తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ వాకాటి కరుణ గురువారం షెడ్యూల్ను విడుదల చేశారు. సెప్టెంబర్ రెండు నుంచి మూడు వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్లైన్ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అదేనెల నాలుగు, ఐదు తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఆనెల నాలుగు నుంచి ఏడు వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని వివరించారు. సెప్టెంబర్ 11న తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
అదేనెల 11 నుంచి 14 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ 17 నుంచి తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుం దని తెలిపారు. 17న ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్లైన్ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. 18న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందనీ, 17 నుంచి 19 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేయాలని కోరారు. 23న తుదివిడత కౌన్సెలింగ్లో సీట్లు కేటాయిస్తామని వివరించారు.
అదేనెల 23 నుంచి 25 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాలనీ, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్రిపోర్టింగ్ చేయాలని కోరారు. 23 నుంచి 26 వరకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు రిపోర్టు చేయాలని సూచించారు. ఇతర వివరాలు, సమాచారం కోసం వచ్చేనెల 23 నుంచిhttps://tseamcetb.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.
సెప్టెంబర్ 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు
ప్రయివేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఎంసెట్ బైపీసీ విద్యార్థుల స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను సెప్టెంబర్ 24న విడుదల చేస్తామని వాకాటి కరుణ తెలిపారు. ఇతర వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.