నేటి నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌

– అందుబాటులో 8,312 సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్‌ ఇంజినీరింగ్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులకు శనివారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలనీ, హెల్ప్‌లైన్‌ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లేందుకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. అదేనెల నాలుగు, ఐదు తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు.