అన్ని పంటలకూ ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇవ్వాలి

అన్ని పంటలకూ ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇవ్వాలి– రైతుల ఆత్మహత్యలను అరికట్టాలి : ఏఐకేఎస్‌ మహారాష్ట్ర పత్తి, సోయాబీన్‌ రైతుల రాష్ట్ర సదస్సులో డాక్టర్‌ మధుర స్వామినాథన్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో రైతులు పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టపరమైన హామీ కల్పించాల్సిందేనని బెంగుళూరులోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఎకనామిక్‌ అనాలిసిస్‌ విభాగం ప్రొఫెసర్‌ మధుర స్వామినాథన్‌ డిమాండ్‌ చేశారు. ఏఐకేఎస్‌ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ శుక్రవారం బీడ్‌ జిల్లాలోని మజల్‌గావ్‌లో పత్తి, సోయాబీన్‌ రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సదస్సును భారతరత్న డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తె, బెంగుళూరులోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఎకనామిక్‌ అనాలిసిస్‌ విభాగం ప్రొఫెసర్‌ మధుర స్వామినాథన్‌ ప్రారంభించారు. విదర్భ, మరఠ్వాడా ప్రాంతాలలో దురదృష్టవశాత్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యల సంఖ్యలో రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపిస్తున్న ప్రాంతాల్లో రెండు ప్రధాన పంటలైన పత్తి, సోయాబీన్‌ ధరలు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మతం, కులాల వారీగా ప్రజలను విభజించే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రను ఎదుర్కోవడం, వారి వాస్తవ సమస్యలు, వాటికి గల కారణాలపై దృష్టి సారించే కౌంటర్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పత్తి, సోయాబీన్‌లకు మాత్రమే కాకుండా, అన్ని ప్రధాన పంటలకు లాభదాయకమైన ఎంఎస్పీ కల్పిస్తూ చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
సదస్సుకు ఏఐకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్‌ దేశ్‌ముఖ్‌ అధ్యక్షత వహించారు. ఏఐకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది అజరు బురాండే ప్రసంగిం చారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీ (ఏపీఎంసీ) మజల్‌గావ్‌ డైరెక్టర్‌ దత్తా దాకే స్వాగతోపన్యాసం చేశారు. ఏఐకేఎస్‌ జిల్లా కార్యదర్శి మురళీధర్‌ నాగర్‌గోజె కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిసాన్‌ గుజార్‌ సంతాప తీర్మానాన్ని ఉంచారు. ఏఐకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అజిత్‌ నవాలే ప్రధాన తీర్మానం చేశారు. పత్తికి క్వింటాల్‌కు రూ.12 వేలు, సోయాబీన్‌కు రూ. 8 వేలు మద్దతు ధర కల్పింఙ చాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ ఫార్ములా సి2 ప్లస్‌ 50 శాతం ప్రకారం అన్ని పంటలకు ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లను అంగీక రించడానికి నిరాకరిస్తున్న బీజేపీ నేతృత్వంb లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని అన్ని గ్రామాల్లో తీవ్ర ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
సదస్సు ముగింపు ప్రసంగంలో ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ ధావలే మాట్లాడుతూ ఎంఎస్పీ, రుణమాఫీ, పంటల బీమా, పెన్షన్‌, ఇతర రైతు సమస్యలపై ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాల వేదిక నేతృత్వంలో దేశవ్యాప్త పోరాటానికి పిలుపునిచ్చారు. రాబోయే కీలక సార్వత్రిక ఎన్నికలలో రైతు, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌-మత అనుకూల ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ పాలనను ఓడించేందుకు తీవ్ర ప్రచారం చేయాలని డిమాండ్‌ చేశారు.
1967, 1977లో బీడ్‌ జిల్లా నుంచి వరుసగా ఎన్నికైన ఇద్దరు ప్రముఖ పార్లమెంటు సభ్యులు, ఏఐకేఎస్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు క్రాంతిసిన్హ్‌ నానా పాటిల్‌, ఏఐకేఎస్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్‌ అప్పా బురాండే సంఘం ఏఐకేఎస్‌ ను మరింత బలోపేతం చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.బీడు జిల్లాకు చెందిన వందలాది మంది ఏఐకేఎస్‌, సీఐటీయూ, ఎఐఎడబ్ల్యుయు,ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా కార్యకర్తలు ఈ సదస్సును విజయవంతం చేసేందుకు మూడు వారాల పాటు అలుపెరగకుండా కృషి చేశారు. వారి అద్భుతమైన పనిని ఉపాధ్యాయుల ఉద్యమ సీనియర్‌ నాయకుడు పిఎస్‌ ఘడ్గే గుర్తించి, ధన్యవాదాలు తెలిపారు.