– తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ కార్మికుల సమ్మె ఈనెల 10వ తేదీకి వాయిదా వేసినట్టు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) తెలిపింది. శనివారం యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం చర్చలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెను చర్చల అనంతరం సమస్యలు పరిష్కారం కాకపోతే 10 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ మేరకు శనివారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా నర్సింహులు, ఉపాధ్యక్షులు పి.సుధాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 8, 9 తేదీల్లో మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలనీ, ఆంధ్రప్రదేశ్ లో చెల్లిస్తున్నట్టుగా నెలకు రూ.21 వేలు చెల్లించాలనీ, కొత్తగా నియామకం చేసిన కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలనీ, ఇన్సూరెన్స్ కల్పించాలనీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, తదితర సమస్యలను పరిష్కరించాలని యూనియన్ సెప్టెంబర్ 25న ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి సమ్మె ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేషీ నుంచి డీఎంఏకు ఆదేశాలొచ్చాయి. దీంతో అక్టోబర్ 9న యూనియన్ తో డీఎంఏ చర్చలు జరపనున్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తగిన కృషి చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి రాజమల్లు, ఎర్రా నర్సింహులు, కార్యదర్శి పి సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రెండో పీఆర్సీ చైర్మెన్గా ప్రభుత్వం నియమించిన ఎన్ శివశంకర్కు వారు అభినందనలు తెలిపారు. రకరకాల క్యాటగిమున్సిపల్ కార్మికుల సమ్మె 10కి వాయిదా
సమస్యలను పీఆర్సీ కమిటీకి తెలియజేసేందుకు యూనియన్కు తగిన సమయం ఇవ్వాలని కోరారు.