పబ్లిక్‌ ప్రయివేటు భాగస్వామ్యంతో మూసీ అభివృద్ధి

– నిపుణులు, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ప్రతిపాదనలతో రావాలి : సీఎస్‌ శాంతికుమారి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి అన్నారు. దీన్ని పబ్లిక్‌ ప్రయివేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 24వ బోర్డు సమావేశాన్ని సోమవారం సచివాలయంలో శాంతికుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఎంఏయూడీ ముఖ్యకార్య దర్శి దానకిశోర్‌, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఆమ్రపాలి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ మూసీ ప్రాజెక్ట్‌పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసేవిధంగా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని అధికారులను ఆమె కోరారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని అధికారులను ఆదేశించారు. ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఆమ్రపాలి ప్రాజెక్ట్‌ అంశాలను సమావేశంలో వివరించారు. ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలు, గుర్తించబడిన పనుల డీపీఆర్‌లు, కాన్సెప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ మొదలైన విభాగాలకు ఈ సమావేశంలో టైమ్‌లైన్‌లు నిర్ణయించబడ్డాయని చెప్పారు. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా సిద్ధమవుతుందని ఆమె వివరించారు. అనేక ప్రయివేట్‌ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని కనబరుస్తున్నాయని ఎంఏయూడీ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ చెప్పారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ఉస్మాన్‌ సాగర్‌ డ్యామ్‌ డౌన్‌స్ట్రీమ్‌ పాయింట్‌ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు, హిమాయత్‌సాగర్‌ డ్యామ్‌ డౌన్‌స్ట్రీమ్‌ పాయింట్‌ నుంచి బాపూఘాట్‌లో సంగమం పాయింట్‌ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది విస్తరణ ప్రతిపాదనపై బోర్డు చర్చించింది. నగరంలోని మూసీ నది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించింది.