ఒలింపిక్స్‌కు నగాల్‌!

– టెన్నిస్‌ స్టార్‌కు బెర్త్‌ లాంఛనమే
న్యూఢిల్లీ : భారత టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ నగాల్‌ కంటే మెరుగైన ర్యాంక్‌ ఆటగాళ్లు పారిస్‌ బరి నుంచి తప్పుకున్నారు. దీంతో విశ్వక్రీడల్లో పోటీపడే అవకాశం సుమిత నగాల్‌కు దక్కనుంది. ఈ మేరకు సుమిత్‌ నగాల్‌ సోషల్‌ మీడియా వేదికగా పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హతను ప్రకటించాడు. ‘2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయాన్ని మీతో పంచుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నా కెరీర్‌లో ఇదో శిఖర సమాన ఘట్టం. ఒలింపిక్స్‌కు నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుందని’ నగాల్‌ సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నాడు. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జులై 4న పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయనుంది. ఈ జాబితాలో సుమిత్‌ నగాల్‌ చోటు దక్కించుకోవటం లాంఛనమే. 26 ఏండ్ల నగాల్‌ …వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో భారత సింగిల్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా నిలువనున్నాడు. లియాండర్‌ పేస్‌ 1992, 1996, 2000 ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో పోటీపడ్డాడు. 1996 ఒలింపిక్స్‌లో లియాండర్‌ పేస్‌ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.