సంక్రాంతి బరిలోకి కిష్టయ్య దిగుతున్నాడు : నాగార్జున

‘మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ సంక్రాంతి నాలుగు సినిమాలు వస్తున్నాయి. పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ‘గుంటూరుకారం’తో వస్తున్న మహేష్‌ బాబుకి, హను-మాన్‌ సినిమాతో వస్తున్న తేజకి, మా వెంకీ 75వ చిత్రంగా సైంధవ్‌తో వస్తున్నారు.వీళ్ళందరికీ ఆల్‌ ది బెస్ట్‌. మేము ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మీకు మా సినిమా నచ్చుతుంది’ అని నాగార్జున అన్నారు. ఆయన లేటెస్ట్‌గా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్‌ విజరు బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌, రుక్సర్‌ ధిల్లాన్‌, మిర్నా మీనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 14న గ్రాండ్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ, ‘ మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది ఒక పుస్తకం రాసిస్తాం. సినిమా విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులకు ఒక మాట చెప్పాలి. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీసు కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని తెలిపారు.