నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్

– మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత జీవితాన్ని కోల్పోతుంది
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డి అన్నారు. ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదకద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు, లైన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, 12 బెటాలియన్  పోలీసులు, పి ఈ టి అసోసియేషన్ సభ్యులతోపాటు, నల్గొండ పట్టణ  పుర ప్రముఖులు, జిల్లా పరిషత్, ఐసిడిఎస్, డి ఆర్ డి ఏ, గిరిజన అభివృద్ధి శాఖ లకు  చెందిన అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ఈ ర్యాలీ డ్రగ్స్ ను నిర్మూలిద్దాం యువతను కాపాడుదాం. డ్రగ్స్ వద్దు జీవితం వద్దు డ్రగ్స్ ను పక్కన పెట్టు జీవితాన్ని గాడిలో పెట్టు అని నినాదాలతో సాగింది. క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో  జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. మనిషి జీవితంలో 15 నుండి 35 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో  మాదకద్రవ్యాలకు  బానిస కావటం వల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు.
ఆలోచన మందగించే ఏదైనా విషంతో సమానమని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదకద్రవ్యాలకు అలవాటు కావద్దని, ఒకవేళ వాటికి బానిస అవుతే జీవితానికి అర్థమే ఉండదని అన్నారు. యువత కుటుంబానికి  అండగా నిలబడాలని కోరారు.  ఇందుకుగాను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి  నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత  తీరికలేని జీవితంలో తమ పిల్లలు ఏం చేస్తున్నారు ?ఎక్కడ తిరుగుతున్నారనే విషయాలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం లేదని, దీంతో కొన్ని మాధ్యమాల ద్వారా పిల్లలు చెడు వైపుకు వెళ్తూ మత్తుకు బానిస అవుతున్నారని, పిల్లలు ఏం చేస్తున్నారో  రోజువారి పరిశీలన చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని గుర్తు చేశారు. పిల్లలు మత్తుకు బానిస కాకుండా  మొదట తల్లిదండ్రుల్లో  అవగాహనరావాలని అన్నారు.  పర్యవేక్షణచేయకపోవడం వల్లే   పిల్లలు చెడు వైపు చూస్తున్నారని, అన్నారు. జిల్లా ఎస్పీ  శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మదకద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు ఎక్కడున్నాయనే వాటి పైన ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదకద్రవ్యాలు అనేవి పెద్ద ట్రాప్ అని, వాటికోసం యువత ప్రయత్నించకూడదని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు అమ్మిన,  సరఫరా చేసిన వెంటనే పోలీస్ శాఖకు  తెలియజేయాలని, మాదకద్రవ్యాలు అమ్మిన, సప్లై చేసిన  ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష  ఉంటుందని తెలిపారు. చదువుకునే యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ దీప్తి,   విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్  రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి,  గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, ఐసిడిఎస్ పిడి సక్కుబాయి, నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్  అమరెందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ చైర్మన్ కె.వి.ప్రసాద్,  తదితరులు  పాల్గొన్నారు.