శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణం. రిషికేశ్వర్ యోగి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్. ఈ మూవీ ఈనెల 25న రాబోతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరో సుధీర్ బాబు, దర్శకులు వీరశంకర్, వీజే సన్నీ, శ్రీరామ్ ఆదిత్య, వితిక షేరు తదితరులు విచ్చేశారు. సుధీర్ బాబు మాట్లాడుతూ, ‘ఈ మూవీ ట్రైలర్ చూశాను. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్గా నటించారు. నా చిత్రంలో ఏదైనా మంచి పాత్రలుంటే వారినే రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. రిషి ఈ మూవీని అద్భుతంగా తీశాడు. ఈ మూవీ చాలా కొత్తగా, రీఫ్రెషింగ్గా ఉండబోతోందనిపిస్తోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
డైరెక్టర్ రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ, ‘ప్రేక్షకులను కచ్చితంగా మా సినిమా మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అని తెలిపారు. ‘సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే.. నేషనల్ అవార్డు కూడా వస్తుంది’ అని శివ కుమార్ రామచంద్రవరపు చెప్పారు. నితిన్ ప్రసన్న మాట్లాడుతూ, ‘ప్రీమియర్లలో మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘మూవీని చూసి, కంటెంట్ నచ్చి విశ్వ ప్రసాద్ ముందుకు వచ్చారు. మాకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హెల్ప్ దొరికింది. అందుకే ఇక్కడి వరకు వచ్చాం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని నిర్మాత డా. సింధు రెడ్డి చెప్పారు.
ప్యాషన్, డబ్బులుంటే సినిమాల్ని తీయలేం. ఒకవేళ తీసినా వాటిని రిలీజ్ని చేయటం కష్టం. ఒకప్పుడు నేనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా. అందుకే ఈ చిత్ర బృందాన్ని చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. దీంతో వారికి సాయం చేయాలని ముందుకు వచ్చాను.
– నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్