జాతీయ రహదారి బాధిత ఆదివాసీలకు నష్టపరిహారం ఇప్పించాలి

–  ఏపీ సీిఎంకు సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి లేఖ
అమరావతి : జాతీయ రహదారి నెంబరు 516ఇ విస్తరణ కోసం ధ్వంసం చేసి, స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించి ఆదివాసీలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీ(ఐ)ఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. విజయనగరం నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 156ఇ) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని, దీనికోసం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి మాడుగుల, జికెవీధి, కొయ్యూరు, రాజవొమ్మంగి మొత్తం 11 మండలాల్లో రహదారి నిర్మాణ పనులను గుత్తేదారు ప్రారంభించి 30 శాతం పూర్తి చేశారని తెలిపారు. ముఖ్యంగా జిరాయితీ పట్టా భూమి, అటవీ పోడు భూములు కలిపి సుమారు 50 ఎకరాలు రహదారికి ఇరువైపులా ధ్వంసం చేశారని, ఆదివాసీలకు అటవీ పోడు భూములే ప్రధానమైన జీవనాధారమని పేర్కొన్నారు. కాఫీ తోటలు, వరి, రాజ్‌మా చిక్కుడు, పసుపు పంట సుమారు 1500 మంది సాగుచేస్తున్నారని తెలిపారు. 2005వ సంవత్సరానికన్నా ముందు అటవీ ప్రాంతంలో జీవిస్తున్న, సాగుచేస్తున్న ఆదివాసీలకు వ్యక్తిగత, ఉమ్మడి అటవీ యాజమాన్యపు హక్కును కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని అన్నారు. పదెకరాలకు తక్కువ లేకుండా వ్యక్తిగత అటవీహక్కు పత్రాలు జారీచేయాల్సిన అధికారులు హక్కు పత్రాలు లేవని మాయమాటలు చెప్పి బలవంతంగా లాక్కొన్నారని, తాగునీరు పైపు, గ్రామ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారని వివరించారు.