రిసాయా అకాడమీతో ఎన్‌ఏయూ భాగస్వామ్యం

– ఆధునిక టెక్నాలజీలో నైపుణ్యాల పెంపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికాలోని భారతీయ విద్యార్థులకు టెక్నాలజీ రంగంలో ప్రత్యేక విద్యను అందించడానికి రిసాయా అకాడమీతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు నార్తర్న్‌ అరిజోనా యూనివర్సిటీ (ఎన్‌ఏయూ) తెలిపింది. ఇందుకోసం ఐదు వారాల సమ్మర్‌ స్కూల్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఈ భాగస్వామ్యానికి మల్లారెడ్డి విశ్వవిద్యాలయంతో చేసుకున్న అవగాహన ఒప్పందంతో మరింత మంది విద్యార్థుల రాక పెరగనుందని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్‌ఏయూ గ్లోబల్‌ అఫైర్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రోవోస్ట్‌ సీజర్‌ ఫ్లోర్స్‌, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ విఎస్‌కె రెడ్డి మాట్లాడుతూ ఈ ఇంటెన్సివ్‌ సమ్మర్‌ ప్రోగ్రామ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బ్లాక్‌చైన్‌, ఏఐ, ఎంఎల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ) వంటి రంగాల్లో డిగ్రీలు అభ్యసిస్తున్న విద్యార్థులకు క్లిష్టమైన నైపుణ్యాలను పొందడానికి వీలుందన్నారు. ఈ భాగస్వామ్యం భారతీయ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో ప్రత్యేకమైన అవకాశాలను ఇస్తుందని రిసాయా అకాడమీ సీఈవో రితీష్‌ బాబు తెలిపారు. ఈ సమావేశంలో మల్లారెడ్డి యూనివర్శిటీ డైరెక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ శాంతి కుమార్‌, ఎన్‌ఏయూ ప్రతినిధులు పాల్గొన్నారు.