తిరస్కరించిన నికరాగ్వా అధ్యక్షుడు
న్యూయార్క్ : ఈయూ-సీఈఎల్ఏసీ శిఖరాగ్ర సమావేశంలో ‘ఫాసిస్టు నాజీ’ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదీమీర్ జెలెన్ స్కీకి మద్దతుగా ప్రకటన చేయమని యూరోపియన్ యూనియన్ వత్తిడి చేయటం కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ క్యార్రిబియన్ స్టేట్స్ (సీఈఎల్ఏసీ) ప్రయోజనాలకు భంగకరమని నికరాగ్వా అధ్యక్షుడు, డేనియల్ ఓర్టేగా ఆరోపించాడు. నికరాగ్వాలో శాండినిస్తా 44వ వార్షిక విజయోత్సాహ సమావేశంలో మాట్లా డుతూ బ్రస్సెల్స్ సమావేశంలో ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధంపట్ల ఆందోళనను వ్యక్తపరిచే ప్రకటనపట్ల తన విచారాన్ని వెలిబుచ్చాడు.
‘నికరాగ్వాను అమెరికా అనుకూల దేశం’గా మార్చేందుకు యూరోపియన్ యూనియన్ ప్రయత్నిస్తున్ననీ, మూడవ సీఈఎల్ఏసీ-యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశం చేసిన అసత్య సంయుక్త ప్రకటనపై తన ప్రభుత్వం సంతకం చేయలేదని, ఆమోదించలేదని, అను సరించలేదని ఆయన గట్టిగా చెప్పాడు. తీర్మానాలను అందరి సమ్మతితో ఆమోదించాలనీ, యూరోపియన్ యూనియన్ సరియైన పద్ధతిని అను సరించకుండా సీఈఎల్ఏసీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని ఆయన అన్నాడు.
‘సీఈఎల్ఏసీతో జరిగిన యూరోపియన్ కమ్యూనిటీ సమావేశంలో వాళ్లు ఫాసిస్టు, నాజీ ఉక్రెయిన్ అధ్యక్షుడిని భాగం చేయాలని చూశారు. యూరోపియన్లు ఎంతగా ఒత్తిడి చేసినా మెజారిటీ సీఈఎల్ఏసీ దేశాలు ఫాసిస్టు ఉక్రెయిన్ అధ్యక్షుడికి మద్దతుగా నిలువలేదు’ అని ఓర్టేగా అన్నాడు. శిఖరాగ్ర సభ సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా మాత్రమే కారణమని సూచించే వాక్యాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని తిప్పికొట్టారని కూడా ఆయన అన్నాడు.