గాలే : సెప్టెంబర్ 26 నుంచి గాలే వేదికగా న్యూజిలాండ్తో జరిగే రెండో టెస్ట్ కోసం శ్రీలంక తుది జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక మేనేజ్మెంట్ రెండు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన రమేశ్ మెండిస్, లహీరు కుమార స్థానాల్లో అన్ క్యాప్డ్ ప్లేయర్ నిషాన్ పెరిస్, మిలన్ రత్నాయకే తుది జట్టులోకి వచ్చారు. స్పిన్నర్ రమేశ్ మెండిస్ తొలి టెస్ట్లో ఆరు వికెట్లు తీసినప్పటికీ అతన్ని తుది జట్టు నుంచి తప్పించడం ఆసక్తికరం. రమేశ్ తొలి టెస్ట్లో వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకోవడమే ఇందుకు కారణం. ఇక పేసర్ లహీరు కుమార న్యూజిలాండ్తో తొలి టెస్ట్లో ప్రభావం చూపించ లేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అందుకే రెండో టెస్ట్లో ఇతని స్థానాన్ని మరో పేసర్ మిలన్ రత్నాయకేతో భర్తీ చేసింది శ్రీలంక మేనేజ్మెంట్. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కమిందు మెండిస్ సెంచరీతో ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు.
జట్లు(అంచనా)…
శ్రీలంక: ధనంజయ డిసిల్వ (కెప్టెన్), కరుణరత్నే, నిస్సంక, చండీమల్, మాథ్యూస్, కమిందు మెండిస్, కుసాల్ మెండిస్, నిషాన్ పెరిస్, ప్రభాత్ జయసూర్య, మిలన్ రత్నాయకే, అశిత ఫెర్నాండో.
న్యూజిలాండ్: టిమ్ సౌథీ(కెప్టెన్), లాథమ్, కాన్వే, విలియమ్సన్, మిఛెల్, రచిన్ రవీంద్ర, బ్లండెల్(వికెట్ కీపర్), ఫిలిప్స్, సాంట్నర్, అజాజ్ పటేల్, రూర్కే.