ఎన్నారై సెల్‌ హామీకి తొమ్మిదినరేండ్లు

– విస్మరించిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌: గంప వేణుగోపాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నారై సెల్‌ ఏర్పాటు చేస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ 2004లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తొమ్మిదినరేండ్లు గడిచినా ఆ హామీని నెరవేర్చలేదని టీపీసీసి ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ గంప వేణుగోపాల్‌ (లండన్‌) విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016 ఏప్రిల్‌ లో ఎన్నారై మంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు తీసుకున్నారని తెలిపారు. 2016 జులై 27న ఎన్నారై వర్క్‌ షాప్‌ పెట్టి ఎన్నారై సెల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి ఏడేండ్లు గడిచిందని చెప్పారు.
గల్ఫ్‌ వలస వెళ్లి చనిపోయిన 1,800 మంది రైతులకు రైతు బీమా వర్తింపజేయలేదని విమర్శించారు. రెండు సార్లు ఎన్నికల ప్రణాళికల్లో ఎన్నారై సెల్‌, ఎన్నారై పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తామనీ, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి మోసగించారని తెలిపారు
. రేషన్‌ కార్డుల్లో పేర్ల తొలగింపుతో పథకాలు అందుకోలేకపోతున్నారన్నారు. త్వరలో టీపీసీసీ ఎన్నారై డిక్లరేషన్‌ ప్రకటిస్తుందని వెల్లడించారు.