ఆర్టీసీ కార్మికులకు నో పెన్షన్‌ సర్టిఫికెట్లు

 – ఆదిలాబాద్‌ ఆర్‌ఎమ్‌ ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు నో పెన్షన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని టీజీఎస్‌ఆర్టీసీ ఆదిలాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని రీజియన్‌ పరిధిలోని డిపో మేనేజర్లకు పంపారు. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీలోని కొన్ని కార్మిక సంఘాలు స్వాగతించాయి. ఇటీవల ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్‌ ఆర్‌ఎమ్‌కు మెమోరాండం ఇచ్చింది. తమకు సంస్థ నుంచి ఎలాంటి పెన్షన్‌ సౌకర్యం లేదనీ, అయినా ఆర్టీసీలో పనిచేసినందుకు రేషన్‌కార్డులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హులం కాలేకపోతున్నామని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. తమకు పెన్షన్‌ సౌకర్యం లేదనే సర్టిఫికెట్‌ తేవాలని ప్రభుత్వ శాఖలు కోరుతున్నాయనీ, అయితే కొన్ని డిపోల మేనేజర్లు ఈ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్‌ఎమ్‌ నిబంధనల మేరకు అర్హులైన రిటైర్డ్‌ ఉద్యోగులకు నో పెన్షన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.