”తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఉన్నట్లుండి శుక్రవారం నుంచి సినిమా ధియేటర్స్ను తాత్కాలికంగా మూసివేసేందుకు నిర్ణయించడం షాక్కు గురిచేసింది’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘థియేటర్లలో ఆక్యూపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ వారు చెబుతున్నారు. జూన్ 27వ తేదీ ‘కల్కీ’ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వరకు చిన్న సినిమాల రిలీజ్లే ఉన్నాయి. ఎన్నికల హడావుడి అనేది దేశమంతా ఉంది. నేను అడిగేది ఒక్కటే…మీరు ఒక్కరే ఎలా నిర్ణయం తీసుకుంటారు?, నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా! .అలాగే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి వంటి వాటితో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఉన్నట్లుండి, ఎల్లుండి (శుక్రవారం) నుంచి ధియేటర్స్ మూస్తే ఇబ్బందికరం.. మీ వల్ల నిర్మాతలకు, మల్టీప్లెక్స్లకు కూడా ఇబ్బందే.. నిర్మాతలు కంటెంట్ సిద్ధం చేసుకున్నాక ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి. ప్రేక్షకులు దీనివల్ల ఓటీటీలకు ఇంకా అలవాటుపడతారు. మరలా ధియేటర్స్ ఓపెన్ చేసినా ఆడియన్స్ వస్తారా.? ఒక్కసారి ఆలోచించాలి. కల్కీ, పుష్ప 2, ఓజి, దేవర వంటి పెద్ద సినిమాలకు మాత్రమే ధియేటర్స్ ఓపెన్ చేసి, చిన్న సినిమాలు మనకు అవసరం లేదు అని చెప్పడమేనా మీ ఉద్దేశ్యం?. పది రోజులు థియేటర్లు బంద్ అనడంలో మీ ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.
నేను ఒక ఎగ్జిబిటర్గా ఉన్నాను. థియేటర్ వారి భాధలు ఏమిటో నాకు కూడా తెలుసు. కానీ మనం తీసుకునే నిర్ణయం అందరూ మెచ్చదగినదిగా ఉండాలి అని నా అభిప్రాయం. ఇప్పటికైనా వెంటనే అత్యవసర జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి, దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన మంచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే చిన్న సినిమాలకు మనుగడ ఉంటుంది’ అని చెప్పారు.