కలెక్టర్‌, కమిషనర్లకు నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ పాతబస్తీలో చార్మినార్‌ నుంచి హరిబౌలి రోడ్డు వెడల్పు చేసేందుకు 2005లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు బదులు తిరిగి కొత్తగా నోటిఫికేషన్‌ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదో చెప్పాలంటూ గత హైదరాబాద్‌ కలెక్టర్‌ ఎల్‌. శర్మన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, వెంకటేశ్వర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌లకు హైకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. జులై 31న జరిగే విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంది. రోడ్డు వెడల్పు చేసే చర్యల్లో భాగంగా చేపట్టిన భూసేకరణ నోటిఫికేషను సవాలు చేస్తూ కొంత మంది పిటిషన్లు దాఖలు చేస్తే దానిని హైకోర్టు కొట్టివేసింది. దీనిపై పిటిషనర్లు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టిన సందర్భంగా భూసేకరణ నోటిఫికేషన్లు ఉపసంహరించుకుని తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రభుత్వ ప్లీడర్‌ చెప్పారు. దీంతో డివిజన్‌ బెంచ్‌ అప్పీల్‌ పిటిషన్‌పై విచారణ మూసేసింది. అయితే, ప్రభుత్వం తిరిగి నోటిఫికేషన్‌ ఇవ్వడంలేదని, పాత నోటిఫికేషన్‌ ప్రకారమే భూసేకరణ చేపడుతున్నారని, ఇదికోర్టు ఇచ్చిన హామీని ఉల్లంఘించి కోర్టుధిక్కరణకు పాల్పడుతున్నారంటూ సయ్యద్‌ జియాఉద్దీన్‌ హుస్సేనీ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు.