ఏపీలో 897 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్‌

– 21 నుంచి దరఖాస్తు
అమరావతి: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 897 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను, సిలబస్‌ను ఎపిపిఎస్‌సి కార్యదర్శి జె ప్రదీప్‌కుమార్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో గురువారం పొందుపరిచారు. వీటిల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 21 నుంచి జనవరి 10 అర్ధరాత్రి వరకు షషష.జూరష.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు. ప్రాథమిక పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని వెల్లడించారు. జిఓ 5 ఆధారంగా ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్‌) నుంచి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ప్రధాన పరీక్ష నిర్వహణ తేదీలను తరువాత ప్రకటిస్తామన్నారు.
జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిల్టీ సబ్జెక్టులో 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఒఎంఆర్‌ విధానంలో 150 నిమిషాలపాటు ఈ పరీక్ష జరుగనుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 వంతు నెగిటివ్‌ మార్కు ఉంటుంది. ప్రధాన పరీక్ష ఆబ్జెక్టివ్‌తో పాటు ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానం కూడా ఉంటుంది. దీనిని ఒఎంఆర్‌ విధానంలో నిర్వహించాలా? కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించాలా? అనేది కమిషన్‌ నిర్ణయిస్తుంది. పేపర్‌-1లో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక చరిత్ర, భారత రాజ్యాంగం జనరల్‌ వ్యూ రెండు కలిపి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. దేశ, రాష్ట్ర ఎకనామీ సబ్జెక్టుతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్టు కలిపి 150 మార్కులకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షల్లోనూ నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. కటాఫ్‌ వివరాలను కమిషన్‌ వెల్లడించలేదు.