ఉత్పత్తికి ఒపెక్ కోత..!
న్యూయార్క్ : అంతర్జాతీయంగా చమురు వ్యాపారులు ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ధరలు పెరిగే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. చమురు ఎగుమతి దేశాలు (ఒపెక్) ఉత్పత్తికి కోత పెట్టే అవకాశం ఉందని సౌది ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలతో మంగళవారం ప్యూచర్ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. జూలై డెలివరీ కోసం వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుఐటి) న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజీలో బ్యారెల్కు 86 సెంట్లు లేదా 1.19 శాతం పెరిగి 72.91 యుఎస్ డాలర్ల వద్ద ముగిసింది. జూలై డెలివరీ కోసం బ్రెంట్ క్రూడ్ 85 సెంట్లు లేదా 1.12 శాతం పెరిగి లండన్ ప్యూచర్స్ ఎక్సేంజీలో బ్యారెల్ 76.84 డాలర్ల వద్ద నమోదయ్యింది. వచ్చే నెలలో పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) భాగస్వాముల భేటీకి ముందు సౌదీ మంత్రి ప్రకటనతో ఉత్పత్తి తగ్గింపునకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.