11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం

– ఈ ఏడాది 4.50 లక్షల గృహాల నిర్మాణం
– ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం : మంత్రి పొంగులేటి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇండ్లు లేని పేదవారి కోసం రాష్ట్రంలో ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లను నిర్మించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఈనెల 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు వెల్లడించారు. బుధవారంహైదరాబాద్‌లోని సచివాలయంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి చర్చించారు. హామీలు ఇవ్వడమే కాదు ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమన్నారు. ‘పేదవారికి సొంత ఇల్లు ఒక కల… అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగే’ అని అన్నారు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. తొమ్మిదిన్నరేండ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఆ కర్తవ్యాన్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను, ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సహాయం అందించేందుకు అవసరమైన కార్యచరణను ప్రారంభించిందని తెలిపారు. తొలి విడతగా ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. తొలి విడతలో సొంత స్థలం కలిగిన వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయనున్నామని తెలిపారు. 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా ఇండ్లను నిర్మించాలనీ, హాలు, బెడ్‌ రూమ్‌తోపాటు వంటగది, బాత్‌రూమ్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల పేరుపై ఇండ్లను మంజూరు చేస్తామనీ, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్దిదారులను ఎంపి చేస్తామని వివరించారు. ఇందుకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని అధికారులకు సూచించారు. పేదవారి సొంతింటి కల సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇప్పుడు సాకారం కాబోతున్నదని సంతోషం వ్యక్తం చేశారు.