
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
2024-25 సంవత్సరానికి పార్లమెంట్లో ఈ రోజు ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ రైతులను, వ్యవసాయరంగాన్ని పూర్తిగా మోసం చేసే విధంగా ఉందని, వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన బడ్జెట్ పై ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు వ్యతిరేకంగా ఉన్న ఈ బడ్జెట్ను సవరించాలని తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరినీ నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా రైతులు నిరసనలు తెలియజేయాలని, రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ పూనుకోలేదని, పైగా ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో కోత పెట్టేందుకు పూనుకున్నదనారు. 14 వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను పెంచామని ఆర్థిక మంత్రి ప్రకటించారనీ, స్వామినాథన్ కమీటి సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలనారు.
కొనుగోలుకు చట్టబద్దత కల్పించాలని, కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో సగం మందికి పైగా ఉపాధిని చూపిస్తున్న వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించేందుకు కూడా సిద్ధం కావడం లేదని విమర్శించారు. రుణమాఫీ ప్రస్తావన తీసుకురాకపోవడం, సహకార రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నం, ఆహార సబ్సిడీగానీ, వడ్డీమాఫీ పథకానికి గానీ, వ్యవసాయ పరిశోధనలకు గానీ, పెరిగిన బడ్జెట్కు అనుగుణంగా కూడా నిధులు పెంచలేదని విమర్శించారు. వడ్డీమాఫీ పథకానికి 2022-23 సంవత్సరంలో రూ.23,000ల కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.22,600 కోట్లు మాత్రమే కేటాయించిందనారు. రీసెర్చ్ కొరకు 2022-23 సంవత్సరంలో రూ.1836 కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు రూ.1200 కోట్లు మాత్రమే కేటాయించారని, రీసెర్చ్ మొత్తాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్తున్నారని, పంటల భీమా పథకంలో కూడా నిధులు కోత పెట్టారు. ప్రధానమంత్రి ఫసల్బీమా పథకాన్ని భీమా కంపెనీలకు కాకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలన్న రైతుల డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ను కూడా నెరవేర్చలేదు. ఉపాధిహామీ పథకానికి కోతలు పెట్టిందనారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేసేందుకు పూనుకోలేదు. సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు, రంగారెడ్డితో సహా ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇక్కడి నుండి ఎన్నికైన 8 మంది పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు.