ఒక గంట ఆరోగ్యానికి కేటాయించాలి

– 10కే రన్‌ ప్రారంభించిన సీపీ శ్వేత, అడిషనల్‌ డీసీపీ మహేందర్‌
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
ప్రతిరోజు ఒక గంట మన ఆరోగ్యం కాపాడుకునేందుకు కేటాయించాలని సిద్దిపేట సీపీ శ్వేతారెడ్డి అన్నారు. సోమవారం హుస్నాబాద్‌లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 10కేరన్‌ కార్యక్రమాన్ని అడిషనల్‌ డీసీపీ మహేందర్‌ జెండా ఊపి ప్రారంభించారు. 10కేరన్‌కు సీపీ శ్వేతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ డబ్బులు ఉంటే దాచుకోవాలని, శరీరంలో ఉండే క్యాలరీస్‌లను ఖర్చు చేయాలని అన్నారు. హుస్నాబాద్‌ చైతన్యాన్ని అందరికీ తెలియపరిచే విధంగా రన్‌ నిర్వహిం చడం జరిగిందన్నారు. మంత్రి తన్నీరు హరీష్‌ రావు చొరవతో రంగనాయక సాగర్‌ ప్రాజెక్టుపై ఆగస్టు 6న హాఫ్‌ మారథాన్‌ రన్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా యువతి, యువకులు ప్రజలు ప్రజాప్రతిని ధులు ఇతర జిల్లా యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈవెంట్‌ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యద్భుతంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదన్నారు. ప్రతిరోజు వాకింగ్‌, రన్నింగ్‌, యోగా, ధ్యానం, స్విమ్మింగ్‌, తప్పకుండా చేయాలని సూచించారు. సిద్దిపేట హాఫ్‌ మారథాన్‌ లో పాల్గొనేందుకు ఆన్లైన్‌ రిజిస్ట్రేషన్‌ లింక్‌ ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లోఅడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ ఎస్‌ మహేందర్‌, హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్‌ కమిటీ చైర్పర్సన్‌ ఎడబోయిన రజని, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ ఐలేని అనిత, హుస్నాబాద్‌ ఏసిపి సతీష్‌, సీఐ ఏర్రాల కిరణ్‌, ఎస్‌ఐ మహేష్‌, అక్కన్నపేట ఎస్‌ఐ వివేక్‌, హుస్నాబాద్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆకుల వెంకన్న, ఉపాధ్యక్షులు బోడుమల్ల సంపత్‌ కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్‌ పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు యువతీ, యువకులు, సిద్దిపేట రన్నర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కత్తుల బాపిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.