– ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ ఆఫర్
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ రంగం లో నిపుణులను తయారు చేయడానికి ఐఐటి మద్రాస్ నూతన కోర్సును ప్రారంభించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బిఎస్)ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. గురువారం హైదరాబాద్లో ఐఐటి మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్ రాధా కృష్ణ గంటి, ప్రొఫెసర్ అనిరుద్దిన్ మీడియాకు కోర్సు వివరాలను వెల్లడించారు. ఈ కోర్సునకు ఆన్లైన్లో జూన్ 25 వరకు దరఖాస్తులను అహ్వానిస్తు న్నామన్నారు. ఇంటర్లో ఫిజిక్స్, గణితం సబ్జెక్టులు కలిగిన వారు అర్హులని తెలిపారు. నాలుగేళ్ల ఈ ఆన్లైన్ కోర్సులో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో విస్తృతావకాశాలు ఉన్నాయన్నారు. కోర్సులోని సెమిస్టర్ల ఆధారంగా ఫీజు రూ.80వేల నుంచి ప్రారంభమవుతుందన్నారు.