నూతన నేర, న్యాయ చట్టాల అమలు తీరుపై అభిప్రాయ సేకరణ

నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య ఆధీనియం అను చట్టాల అమలు తీరును పరిశీలించుట కొరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు (బి.పి.ఆర్.డి) బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు (ఎన్.సి.ఆర్.బి) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, (సి.డి.టి.ఐ) సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఐబి ఇంటిలిజెన్స్ బ్యూరోల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సి డి టి ఐ హైదరాబాద్ డైరెక్టర్ రాజశేఖర్ ఐపిఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ కమిషనరేట్ కు విచ్చేసి వివిధ శాఖల అధికారులతో చర్చించి వారి సందేహాలను అభిప్రాయాలను సేకరించారు.
ముందుగా సి డి టి ఐ డైరెక్టర్ రాజశేఖర్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, తో కలిసి ముందుగా నిజామాబాద్ జిల్లా న్యాయ అధికారి సునీత కుంచాల ని ఇతర జిల్లా న్యాయ అధికారులను కలిసి నూతన న్యాయ చట్టాల అమలు తీరుపై సమగ్రంగా చర్చించినారు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ , డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లను సందర్శించి ఎస్ హెచ్ ఓ లతో పాటుగా ఐటి కోర్ సిబ్బంది , పోలీసు స్టేషన్ రైటర్లతో చర్చించినారు. ఆ తరువాత జిల్లా లోని వివిధ పోలీసు అధికారులతో కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ యందు నూతన నేర న్యాయ చట్టాల అమలు తీరుపై చర్చించినారు.అదేవిధంగా జిల్లాలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లాయర్లతో కూడా ఈ నేర న్యాయ చట్టాలపై అభిప్రాయపై సేకరణ చేశారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ లతో నేర న్యాయ చట్టాల పై అభిప్రాయాలను సేకరణ చేశారు.ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన కుర్ర శ్రీనివాస్, రాజేష్ కుమార్ ఝ, సూరేపల్లి శ్రీనివాస్, వారి సిబ్బందితోపాటుగా నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి , శ్రీనివాస్ బస్వా రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశ్వరరావు సిసిఆర్బి ఏసిపి రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి నారాయణ జిల్లాలోని వివిధ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు, రైటర్లు మరియు ఐటి కోర్ సిబ్బంది, జి జి హెచ్ సూపంటెండెంట్ ప్రతిమ రాజ్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.