దాసోజు ఫిర్యాదుపై 26లోగా ఉత్తర్వులు

– మంత్రి సురేఖ కేసులో హైకోర్టుకు తెలిపిన ఈసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై ఈసీ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ కుమార్‌ చేసిన ఫిర్యాదుపై హైకోర్టు విచారణను ముగించింది. ఈ ఫిర్యాదుపై ఈ నెల 26లోగా తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌పై ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో సంబంధం ఉందంటూ అనుచిత విమర్శలు చేశారనీ, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని దాసోజు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ ఆరాదే. జస్టిస్‌ జె అనిల్‌ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈసీ వివరణ తర్వాత పిటిషన్‌పై హైకోర్టు విచారణను ముగించింది.