ఓవైసీ అక్రమ నిర్మాణాలు కూలుస్తాం

– చెరువులో స్కూళ్లు, కాలేజీ కట్టకపోతే ఎందుకు భయపడుతున్నారు : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ఢీ.. అంటే ఢీ అని పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఓవైసీకి చెందిన స్కూళ్లు, కాలేజీలు చెరువులో కట్టకపోతే వారు ఎందుకు భయపడుతున్నారని ఏలేటి ప్రశ్నించారు. పట్టా ల్యాండ్‌లో నిర్మాణాలుంటే ఎందుకు భయమని నిలదీశారు. బీజేపీ సభ్యుల వైపు వేలెత్తి చూపించి ఎందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ పిల్లలకోసం చెరువులో ఎలా కడతారన్నారు. అంబేద్కర్‌ ను తాము గౌరవిస్తామనీ, అక్బరుద్దీన్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏలేటి డిమాండ్‌ చేశారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చినప్పుడు చెరువును ఆక్రమించి ఒవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చాలని మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా కూలుస్తామని హెచ్చరించారు. తాను ఇల్లీగల్‌ కట్టడాలపై మాట్లాడుతున్నాననీ, ఎవరినీ ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో కూల్చిన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే తమపై కూడా కేసు పెడతారనే భయం కలుగుతోందని సెటైర్లు వేశారు. హైడ్రా వల్ల చెడ్డ పేరు వస్తోందని మంత్రి శ్రీధర్‌ బాబే చెప్పారని గుర్తుచేశారు.
ఏలేటి కి అక్బర్‌ కౌంటర్‌
బీజేపీ సభ్యులు తమను భయపెట్టి బెదిరించాలని చూస్తున్నారని, పదేండ్ల నుంచి బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నామని అక్బర్‌ అన్నారు. మహేశ్వర్‌ రెడ్డి అక్రమ కట్టడాలను కూల్చుతామంటున్నారని, వారి బుల్డోజర్లకు భయపడబోమని కౌంటర్‌ ఇచ్చారు. తన భవనాలన్నింటికీ అనుమతి ఉందన్నారు. సభలో మహేశ్వర రెడ్డి తన పేరు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము కోర్టులను, కోర్టు తీర్పులను గౌరవిస్తామని చెప్పుకొచ్చారు.