పావొలిని జోరు

Paolini is strong– ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశం
– వింబుల్డన్‌
లండన్‌ (ఇంగ్లాండ్‌): వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఇటలీ భామ జాస్మిన్‌ పావొలిని ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ జాస్మిన్‌ శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో అలవోక విజయం సాధించింది. కెనడా క్రీడాకారిణి బియాంకపై 7-6(7-4), 6-1తో వరుస సెట్లలో విజయం సాధించింది. ఓ ఏస్‌ కొట్టిన జాస్మిన్‌.. నాలుగు బ్రేక్‌ పాయింట్లతో సత్తా చాటింది. పాయింట్ల పరంగా 69-52తో బియాంకపై పైచేయి సాధించింది. 12 సీడ్‌, అమెరికా స్టార్‌ మడిసన్‌ కీస్‌కు మూడో రౌండ్లో మెరిసింది. ఉక్రెయిన్‌ అమ్మాయి మార్టాపై 6-4, 6-3తో వరుస సెట్లలో గెలుపొందింది. రెండు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మడిసన్‌ మెప్పించింది. మార్టా ఏడు గేమ్‌ పాయింట్లకే పరిమితం కాగా.. మడిసన్‌ కీస్‌ 12 గేమ్‌ పాయింట్లతో ముందంజ వేసింది. అమెరికా అమ్మాయి ఎమ్మా నవారో మూడు సెట్ల మ్యాచ్‌లో డయానపై పైచేయి సాధించింది. రష్యా అమ్మాయి తొలి సెట్లో 6-2తో గెలుపొంది ముందంజ వేసినా.. వరుస సెట్లలో 6-3, 6-4తో పుంజుకున్న ఎమ్మా ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 14వ సీడ్‌, రష్యా అమ్మాయి దరియా కసట్కియ 6-7(6-8), 6-4, 4-6తో పౌలా బడోసాతో మ్యాచ్‌లో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో బల్గేరియా ఆటగాడు, పదో సీడ్‌ గ్రిగర్‌ దిమిత్రోవ్‌ 6-3, 6-4, 6-3తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. 12వ సీడ్‌ టామీ పాల్‌ 6-3, 6-4, 6-2తో అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై గెలుపొందాడు. ఆలస్యంగా ముగిసిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-2, 6-1, 6-4తో ఏకపక్ష విజయం సాధించాడు.