చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ‘పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్’ పేరుతో వెరైటీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ చిత్ర బిగ్ టికెట్ను లాంచ్ చేశారు. సహ నిర్మాత అనంత్ సాయి మాట్లాడుతూ, ‘ఒక పది పదిహేను నిమిషాలు తప్ప సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని చెప్పారు. ‘చాలా ప్యాషనేట్గా ఈ సినిమా చేశాం. డైరెక్టర్ సంతోష్ ప్రాణం పెట్టి చేశారు. మేం నిర్మాతలుగా కాకుండా ఒక ఆడియన్గా ఈ సినిమా చూశాం. యాంకర్ సుమని కిడ్నాప్ చేశాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని నిర్మాతలు మహీధర్ రెడ్డి, దేవేష్ చెప్పారు. డైరెక్టర్ సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ, ‘ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. ప్రేక్షకుల తప్పకుండా ఎంజారు చేస్తారు’ అని అన్నారు.