పోలీస్‌ కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

నవతెలంగాణ-కొడంగల్‌
కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకులు పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్‌ కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో ఏ1గా ఉన్న నరేందర్‌రెడ్డి.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కొడంగల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం నరేందర్‌రెడ్డిని రెండ్రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. న్యాయవాది సమక్షంలో పట్నం నరేందర్‌రెడ్డిని విచారించాలని కోర్టు ఆదేశించింది. కొడంగల్‌ కోర్టు ఆదేశాలతో ఈ నెల 7 నుంచి 9వ తేదీ ఉదయం 10 గంటల వరకు నరేందర్‌రెడ్డిని పోలీసులు విచారించే అవ కాశం ఉంది. పోలీసులు నరేందర్‌ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌ తరలించనున్నారు.