18 నెలల వేతన బకాయిలు చెల్లించండి

18 నెలల వేతన బకాయిలు చెల్లించండి– గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్‌ ఎదుట గిరిజన హాస్టల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల ధర్నా
– గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌కి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్స్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఇవ్వాల్సిన 18 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్‌ ఎదుట తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్‌ డైలీవేజ్‌ మరియు ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ధర్నా చేశారు. డైలీవేజ్‌ కార్మికులకు ఏడు నెలలు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు 18 నెలలు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం సరిగాదన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నరసింహారెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వారం రోజుల్లో వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని నరసింహారెడ్డి హామీనిచ్చారు. ధర్నాకు ఆ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె. బ్రహ్మాచారి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేందర్‌, వివిధ జిల్లాల నాయకులు లక్ష్మణ్‌ నాయక్‌, హీరాలాల్‌, కౌసల్య, పాయం ముత్తయ్య, తిరుపతమ్మ, నాగమణి ముసలయ్య, రాజేష్‌, పాపారావు, జోడేలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ..క్యాటరింగ్‌ విధానాన్ని రద్దు చేసి ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలనీ, లేని యెడల తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2023 అక్టోబర్‌ 26వ తేదీ నుంచి ఆర్థిక శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాల చెక్కును వెంటనే క్లియరెన్స్‌ చేయాలనీ, చెక్కును పాస్‌ చేసి వేతనాలు విడుదల చేయాలని కోరారు. హాస్టల్‌ కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన కార్మికుల ఆకలి బాధను ఈ ప్రభుత్వానికి పట్టదా ? అని ప్రశ్నించారు. ఐదేండ్ల సర్వీస్‌ పూర్తయిన హాస్టల్‌ వర్కర్లందరినీ పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన కార్మికుల స్థానంలో డైలీవేజ్‌ వర్కర్ల వారసులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వేతనాలకు సరిపడినంత బడ్జెట్‌ కేటాయించాలనీ, ప్రతి నెలా మొదటి వారంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బకాయి వేతనాలు చెల్లించాలని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలోనూ కార్మికులందరూ వ్యక్తిగతంగా దరఖాస్తులు సమర్పించారు.