– హెచ్సీఏ ఆస్తులు, ఖాతాలు పునరుద్ధరణ
హైదరాబాద్ : ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు అమలు చేయకుండా ఏడేండ్లు కాలయాపన చేసిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2004లో ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం సమయంలో విశాఖ ఇండిస్టీస్తో హెచ్సీఏ ఒప్పందం చేసుకుంది. రూల్స్కు విరుద్ధంగా విశాఖతో ఒప్పందాన్ని హెచ్సీఏ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశాఖ ఇండిస్టీస్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లగా.. రూ.25.92 కోట్లు విశాఖకు చెల్లించాలని హెచ్సీఏను కోర్టు ఆదేశించింది. ఏడేండ్లుగా హెచ్సీఏ ఈ తీర్పును పట్టించుకోలేదు. దీంతో బిజెపి నాయకుడు, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేకానంద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైదరాబాద్లో ప్రపంచకప్ మ్యాచులు, సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ విధులకు విఘాతంతో జిల్లా కోర్టు ఆదేశాలను హైకోర్టు పక్కనపెట్టింది. హెచ్సీఏ ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేసింది. ఇదే సమయంలో ఆరు వారాల్లో విశాఖ ఇండిస్టీస్కు రూ.17.5 కోట్లు చెల్లించాలని హెచ్సీఏను ఆదేశించింది.