పీడీయస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలి..

PDSU State General Council should win.– ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి(గుండాల)
వచ్చే నెల ఫిబ్రవరి 4, 5 తేదీల్లో భద్రాచలం పట్టణం బత్తుల నగర్ లోని శుభం ఫంక్షన్ హాల్ లో జరిగే పీడీయస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని ఆ సంఘం ఇల్లందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో శనివారం గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజికించుకునేందుకు ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల తరపున గొంతు విప్పిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ బలోపేతానికి ఏమాత్రం దృష్టి సారించడం లేదనే సత్యాన్ని రాష్ట్రంలో మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు గుర్తించారని అన్నారు. రాష్ట్రంలో గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే అత్యున్నత న్యాయస్థానమే మందలించే స్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారిపోయిన స్థితిని ముఖ్యమంత్రి గుర్తించాలని అన్నారు. సంవత్సరాల తరబడి స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో రూ.7500 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడిచినా చెల్లించకపోవడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పెనుభారంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను నియమించలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్లు భర్తీ చేయడం వదిలేశారని తెలిపారు. విశ్వవిద్యాలయాలలో కనీసం సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని గాలికి వదిలేసారు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో, దేశంలో అందరికి సమానమైన, నాణ్యమైన ఉచిత విద్య సాధించడానికి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధన కోసం పీడీయస్ యూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నూతన ఒరవిడితో ముందుకు సాగడానికి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో భవిష్యత్తు ఉద్యమ రూపకల్పనలు చేసి, విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో షఫియా, అఖిల, హర్ష శ్రీ, శృతి, అనిల్, వెంకటేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.