ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలి

– సాంకేతికత ఉన్నచోట లిఫ్ట్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలి

– జిల్లా అధికారుల కోసం రీక్రియేషన్ క్లబ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
– పంటలు దెబ్బతినకుండా సాగునీటి విడుదలకు చర్యలు
– రాబోయే వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా పటిష్ట కార్యాచరణ
– ఐటీ రంగంలో ఉపాధి కోసం శిక్షణ అందించే టాస్క్ స్కిల్ సెంటర్ త్వరలో ఏర్పాటు
– అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించిన
 రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,  అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి జిల్లా, డివిజన్ అధికారులతో సమీక్షించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడంలో పెద్దపెల్లి జిల్లా రాష్ట్రంలోనే  ముందంజలో ఉంటుందని, మంత్రి ఆదేశాల మేరకు విద్య, వైద్యంపై  ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్యారెంటీ పథకాలపై దరఖాస్తులు స్వీకరించి వంద శాతం ఆన్ లైన్ లో నమోదు చేయడం జరిగిందని,  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.లంచ్ అండ్ లెర్న్ బుధవారం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో జిల్లా అధికారులు భోజనం చేయడం వల్ల ఆహార నాణ్యత మెరుగుపడిందని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పక్కా కార్యాచరణ రూపొందించు కొని అమలు చేస్తున్నామని అన్నారు.లాభదాయక  పంటలైన ఆయిల్ పామ్, కూరగాయల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ల వారీగా నిర్వహిస్తూ ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ  ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీ పథకాలను  ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నడుస్తున్నదని, ఇప్పటి వరకు రూ.10 కోట్ల పైగా జీరో టికెట్లను జారీ చేశామని, మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉపయోగ పడుతుందని అన్నారు.మహాలక్ష్మి పథకం అమలులో వచ్చే సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు బస్సులో ప్రయాణించారని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో చిత్తశుద్ధి కనబర్చిన పెద్దపల్లి జిల్లా అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని మంత్రి పేర్కొన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం వల్ల మన జిల్లాలో 1400 పైగా రోగులు ఇప్పటి వరకు లబ్ది పోందారన్నారు. విద్య, వైద్య రంగాలపై కలెక్టర్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యవసాయ శాఖలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అవగాహన కల్పించాలని, రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా  చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరు అందించే దిశగా సాంకేతికంగా అనుకూలంగా ఉన్నచోట్ల ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని మంత్రి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మార్చి చివరి నాటికి పంచాయతీరాజ్ శాఖ తరపున మంజూరు చేసిన ఉపాధి హామీ పనులు పూర్తిచేయాలని, డిఎంఎఫ్టీ ఫండ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.ప్రతి నియోజకవర్గ పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నిర్మించేందుకు, ఆస్పత్రుల విస్తరణకు, రెసిడెన్షియల్ పాఠశాలల సొంత భవనాల నిర్మాణానికీ,  రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని మంత్రి తెలిపారు.ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా సాంస్కృతిక చరిత్రను చాటి చెబుతూ జిల్లా కలెక్టరేట్లో మ్యూజియం, అదే విధంగా ఉద్యోగుల కోసం లంచ్ రూమ్ లు, గ్రంథాలయ ఏర్పాటు చేసిన కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు..పెద్దపల్లి జిల్లా అధికారుల కోసం రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేయాలని మంత్రి కలెక్టర్ ఆదేశించారు.రైతులు వేసిన పంటలకు ఇబ్బందులు కలగకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నీటి విడుదల షెడ్యూల్ పై స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని, ఎట్టి పరిస్థితుల్లో పంట ఎండిపోకుండా జాగ్రత్తలు వహించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలలో త్రాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ  గ్రిడ్, ఇంట్రా అధికారులు సంపూర్ణ సమాచారంతో నివేదిక సమర్పించాలని, రాబోయే వేసవికాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా ఇబ్బందులు ఉన్న గ్రామాలలో పాత నీటి సరఫరా వ్యవస్థను పునరుద్ధరించాలని మంత్రి తెలిపారు.అక్రమ ఇసుక తరలింపుపై కఠినంగా వ్యవహరించాలని, ఇసుక తరలింపు వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఓవర్లోడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని, కేటాయింపులు పూర్తయిన వెంటనే ఇసుక తరలింపు ప్రక్రియ నిలిపివేసే విధంగా చూడాలని, అక్రమ ఇసుక తరలింపు నివారణపై కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.విద్యార్థులకు ఐటి రంగంలో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తూ ఉపాధి లభించేలా శిక్షణ అందించే టాస్క్ శిక్షణ కేంద్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు.